ఓం నమశ్శివాయ
శివానందలహరి
శ్లోకం 7
మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన విధౌ
తవధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః !! 7 !!
శ్లోకం
పదాన్వయము, ప్రతిపదార్ధ తాత్పర్యములు -
పరమశివ, మనః, తే, పాదాబ్జే, నివసతు, వచః, స్తోత్రఫణితౌ, చ, కరః, అభి+అర్చాయాం, శ్రుతిః అపి, కదా + ఆకర్ణన విధౌ, బుద్ధిః, తవ, ధ్యానే, నయన యుగళం, మూర్తి విభవే, నివసతు, అతః పరం, పరగ్రంథాన్, కైః వా, జానే.
పరమశివ = హే పరమేశ్వరా ! పరమ మంగళ స్వరూపా !
మనః = నా మనస్సు
తే పాదాబ్జే = నీ పాదారవిందములయందే
వచః = నా వాక్కు
స్తోత్ర ఫణితౌ = నిన్ను స్తుతించుటయందు,
చ = మరియు
కరః = కరములు
అభ్యర్చాయాం = నిన్ను పూజించుట యందు;
శ్రుతిః అపి = నా కర్ణములు కూడా
కథా ఆకర్ణన విధౌ = నీ కథలను వినుట యందు,
బుద్ధిః = నా బుద్ధి
తవ ధ్యానే = నీ ధ్యానము నందు
నయన యుగలం = నా నేత్ర ద్వయము
మూర్తి విభవే = నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుటయందు,
నివసతు = నిలిచి ఉండు గాక !
కైః వా = ఏ విధముగా
అతః పరం = ఇంతకు మించి
పర గ్రంథాన్ = నీకు వ్యతిరిక్తమైన గ్రంథములను
కైః వా = ఏ ఇతర ఇంద్రియములతో
జానే = తెలుసుకొనగలను ?
ఓ పరమశివా ! నా మనస్సు నీ పాదారవిందములయందు వసించుగాక ! నా వాక్కు నిన్ను స్తుతించుటయందును, నా కరములు నిన్ను పూజించుటయందును, నా కర్ణములు నీ కథాశ్రవణమనెడి విధి యందును, నా బుద్ధి నీ ధ్యానమునందును, నా నేత్రద్వయము నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుట యందును లగ్నమగుగాక ! అలా నా ఇంద్రియములు నీ యందే ఆసక్తమై ఉండగా ఇక ఇతర గ్రంధముల నుండి అంతకు మించి క్రొత్తగా తెలుసుకొనవలసినది ఏమి మిగిలి యుండును?
అత్యంత ఉదాత్తమైన మానవ ఉపాధి లభించినప్పుడు దానితో ఎలా తరించగలమో చెప్పిన మహోత్కృష్ట మంత్ర సదృశ శ్లోకమిది. బుద్ధిని శివ భక్తి యందు లగ్నము చేసి, తన మనస్సు, వాక్కు మొదలైన ఇంద్రియాలకు కూడా ఇతర విషయాలపై ఆసక్తి లేకుండా చేసి, పరమ శివుని సేవాసక్తిని కలిగించమని జగద్గురువులు ఈ శ్లోకంలో ప్రార్ధిస్తున్నారు.
పరమేశ్వరుడు అనుగ్రహించి ఇచ్చిన మనస్సును ఇంద్రియాలను పరమేశ్వరార్పణమెలా చెయ్యాలో తెలియపరచే శ్లోకమిది. మనకు కన్నులున్నందుకు, చెవులున్నందుకు, చేతులున్నందుకు, మనస్సున్నందుకు, ఈ శరీరమున్నందుకు ఏమి చేస్తే అవి సార్ధకత పొందుతాయో తెలియజేసే స్తోత్ర శ్లోకమిది. ఏ భక్తులైనా పరమేశ్వరుడిని ప్రార్ధించేది ఇదే ! కన్నులున్నందుకు నేను చూస్తే, నిన్నే చూడాలి, చెవులున్నందుకు నీ చరితలే వినాలి, నోరున్నందుకు నీ గుణగానమే చెయ్యాలి, నిన్నే భజించాలి. బుద్ధి ఉన్నందుకు నీ గురించే ఆలోచించాలి, మనస్సున్నందుకు దానిని నీకే అర్పించాలి.
చేతులారంగ శివుని పూజింపడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని,
దయయు సత్యంబు లోనుగా దలపడేని,
కలుగనేటికి తల్లుల కడుపు చేటు !
ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ, నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ, నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ, నా యొక్క కన్నులు నీ దివ్యమంగళ విగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక ! అలా నా మనస్సు, బుద్ధి ఇంద్రియాలు సమస్తమూ నీమీదే లగ్నమై నీ పనులే చేస్తుంటే, ఇంక నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఎలా పని చేస్తాయి? ఇంక వాటికి ఇతర గ్రంథాలను చూడవలసిన పనే ఉండదు. వాటికి నీయందే రమించే తత్త్వమేర్పడినప్పుడు ఇంక ఏ బాహ్య విషయాల మీదకు ప్రసరించటానికీ ఇష్టపడవు. కావున ఓ మహేశ్వరా ! నా మనస్సు నీమీదే లగ్నమయేలా, నా బుద్ధి నిన్నే ధ్యానించేలా, నా చేతులు నిన్నే అర్చించేలా, నా చెవులు నీ కథా శ్రవణమే వినేలా, నా నోరు నిన్నే స్తోత్రించేలా, నా పాదాలు నీకే ప్రదక్షిణ చేసేలా అనుగ్రహింపుము అని ప్రార్ధించాలి. అప్పుడు ఇంద్రియాలు పెడదారి త్రొక్కవు.
ఈ యోగాన్నే భక్త ప్రహ్లాదుడు పసి ప్రాయంలోనే అలవరచుకుని, ఐదేళ్ళ ప్రాయంలో తన తండ్రికి బోధించాడు.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి !!
ఈ పద్యం తెలియని తెలుగువారుండరు. చదివి, విని మైమరచిపోనివారుండరు. మనకు పంచేంద్రియాలను ఇచ్చినందుకు కృతజ్ఞతగా పంచోపచార పూజ చెయ్యాలని చెప్తారు. అది కృతజ్ఞతా ప్రకటన !
పర గ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః - అంటే - మన సకలేంద్రియాలు, సర్వమూ ఈశ్వరుని యందే లగ్నమై ఉంటే, తాను ఇంక ఏ ఇతర ఇంద్రియములతో ఏ ఇతర గ్రంథాలను తెలుసుకుంటాడు ? దానికి అవకాశమే లేదని చెప్తున్నారు జగద్గురువులు.
పరమాత్మ యొక్క విరాట్స్వరూపంలో ఈ చతుర్దశ భువనాలూ నాలుగవ వంతు మాత్రమే ! మిగతా మూడు వంతులూ మనకు అగమ్య గోచరములు. కనిపించే ఈ నాలుగవ వంతులోనే మనకు తెలిసినది అత్యల్పం. అటువంటి పరమాత్మను ఎలా తెలుసుకోగలము ?
"పాదో2స్య విశ్వా భూతాని, త్రిపాదస్యామృతం దివి
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః ..."
మరి అటువంటి విరాట్పురుషుని అల్ప శక్తిమంతమైన ఇంద్రియాలతో మనం ఎలా పట్టుకో గలము ? మనం ఎలా తరించాలి, అంటే, మనం సృష్టిని, ప్రపంచాన్ని ఎలా చూడాలో తెలుసుకోవాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ప్రపంచంలో వేరు వేరు నామ రూపాలతో కనిపించే సమస్తమూ పరమాత్మ ప్రకటనమేనని గ్రహించాలి. జగత్తును జగత్తుగా చూడకుండా, జగత్తును పరమాత్మ అభివ్యక్తిగా చూడాలి. జగత్తంతా వ్యాపించిన పరమాత్మను దర్శించాలి అని చెప్తున్నారు.
🙏🙏🙏🌹🌹
డా.టి.(ఎస్)విశాలాక్షి
శివానందలహరి
శ్లోకం 7
మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన విధౌ
తవధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః !! 7 !!
శ్లోకం
పదాన్వయము, ప్రతిపదార్ధ తాత్పర్యములు -
పరమశివ, మనః, తే, పాదాబ్జే, నివసతు, వచః, స్తోత్రఫణితౌ, చ, కరః, అభి+అర్చాయాం, శ్రుతిః అపి, కదా + ఆకర్ణన విధౌ, బుద్ధిః, తవ, ధ్యానే, నయన యుగళం, మూర్తి విభవే, నివసతు, అతః పరం, పరగ్రంథాన్, కైః వా, జానే.
పరమశివ = హే పరమేశ్వరా ! పరమ మంగళ స్వరూపా !
మనః = నా మనస్సు
తే పాదాబ్జే = నీ పాదారవిందములయందే
వచః = నా వాక్కు
స్తోత్ర ఫణితౌ = నిన్ను స్తుతించుటయందు,
చ = మరియు
కరః = కరములు
అభ్యర్చాయాం = నిన్ను పూజించుట యందు;
శ్రుతిః అపి = నా కర్ణములు కూడా
కథా ఆకర్ణన విధౌ = నీ కథలను వినుట యందు,
బుద్ధిః = నా బుద్ధి
తవ ధ్యానే = నీ ధ్యానము నందు
నయన యుగలం = నా నేత్ర ద్వయము
మూర్తి విభవే = నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుటయందు,
నివసతు = నిలిచి ఉండు గాక !
కైః వా = ఏ విధముగా
అతః పరం = ఇంతకు మించి
పర గ్రంథాన్ = నీకు వ్యతిరిక్తమైన గ్రంథములను
కైః వా = ఏ ఇతర ఇంద్రియములతో
జానే = తెలుసుకొనగలను ?
ఓ పరమశివా ! నా మనస్సు నీ పాదారవిందములయందు వసించుగాక ! నా వాక్కు నిన్ను స్తుతించుటయందును, నా కరములు నిన్ను పూజించుటయందును, నా కర్ణములు నీ కథాశ్రవణమనెడి విధి యందును, నా బుద్ధి నీ ధ్యానమునందును, నా నేత్రద్వయము నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుట యందును లగ్నమగుగాక ! అలా నా ఇంద్రియములు నీ యందే ఆసక్తమై ఉండగా ఇక ఇతర గ్రంధముల నుండి అంతకు మించి క్రొత్తగా తెలుసుకొనవలసినది ఏమి మిగిలి యుండును?
అత్యంత ఉదాత్తమైన మానవ ఉపాధి లభించినప్పుడు దానితో ఎలా తరించగలమో చెప్పిన మహోత్కృష్ట మంత్ర సదృశ శ్లోకమిది. బుద్ధిని శివ భక్తి యందు లగ్నము చేసి, తన మనస్సు, వాక్కు మొదలైన ఇంద్రియాలకు కూడా ఇతర విషయాలపై ఆసక్తి లేకుండా చేసి, పరమ శివుని సేవాసక్తిని కలిగించమని జగద్గురువులు ఈ శ్లోకంలో ప్రార్ధిస్తున్నారు.
పరమేశ్వరుడు అనుగ్రహించి ఇచ్చిన మనస్సును ఇంద్రియాలను పరమేశ్వరార్పణమెలా చెయ్యాలో తెలియపరచే శ్లోకమిది. మనకు కన్నులున్నందుకు, చెవులున్నందుకు, చేతులున్నందుకు, మనస్సున్నందుకు, ఈ శరీరమున్నందుకు ఏమి చేస్తే అవి సార్ధకత పొందుతాయో తెలియజేసే స్తోత్ర శ్లోకమిది. ఏ భక్తులైనా పరమేశ్వరుడిని ప్రార్ధించేది ఇదే ! కన్నులున్నందుకు నేను చూస్తే, నిన్నే చూడాలి, చెవులున్నందుకు నీ చరితలే వినాలి, నోరున్నందుకు నీ గుణగానమే చెయ్యాలి, నిన్నే భజించాలి. బుద్ధి ఉన్నందుకు నీ గురించే ఆలోచించాలి, మనస్సున్నందుకు దానిని నీకే అర్పించాలి.
చేతులారంగ శివుని పూజింపడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని,
దయయు సత్యంబు లోనుగా దలపడేని,
కలుగనేటికి తల్లుల కడుపు చేటు !
ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ, నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ, నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ, నా యొక్క కన్నులు నీ దివ్యమంగళ విగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక ! అలా నా మనస్సు, బుద్ధి ఇంద్రియాలు సమస్తమూ నీమీదే లగ్నమై నీ పనులే చేస్తుంటే, ఇంక నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఎలా పని చేస్తాయి? ఇంక వాటికి ఇతర గ్రంథాలను చూడవలసిన పనే ఉండదు. వాటికి నీయందే రమించే తత్త్వమేర్పడినప్పుడు ఇంక ఏ బాహ్య విషయాల మీదకు ప్రసరించటానికీ ఇష్టపడవు. కావున ఓ మహేశ్వరా ! నా మనస్సు నీమీదే లగ్నమయేలా, నా బుద్ధి నిన్నే ధ్యానించేలా, నా చేతులు నిన్నే అర్చించేలా, నా చెవులు నీ కథా శ్రవణమే వినేలా, నా నోరు నిన్నే స్తోత్రించేలా, నా పాదాలు నీకే ప్రదక్షిణ చేసేలా అనుగ్రహింపుము అని ప్రార్ధించాలి. అప్పుడు ఇంద్రియాలు పెడదారి త్రొక్కవు.
ఈ యోగాన్నే భక్త ప్రహ్లాదుడు పసి ప్రాయంలోనే అలవరచుకుని, ఐదేళ్ళ ప్రాయంలో తన తండ్రికి బోధించాడు.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి !!
ఈ పద్యం తెలియని తెలుగువారుండరు. చదివి, విని మైమరచిపోనివారుండరు. మనకు పంచేంద్రియాలను ఇచ్చినందుకు కృతజ్ఞతగా పంచోపచార పూజ చెయ్యాలని చెప్తారు. అది కృతజ్ఞతా ప్రకటన !
పర గ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః - అంటే - మన సకలేంద్రియాలు, సర్వమూ ఈశ్వరుని యందే లగ్నమై ఉంటే, తాను ఇంక ఏ ఇతర ఇంద్రియములతో ఏ ఇతర గ్రంథాలను తెలుసుకుంటాడు ? దానికి అవకాశమే లేదని చెప్తున్నారు జగద్గురువులు.
పరమాత్మ యొక్క విరాట్స్వరూపంలో ఈ చతుర్దశ భువనాలూ నాలుగవ వంతు మాత్రమే ! మిగతా మూడు వంతులూ మనకు అగమ్య గోచరములు. కనిపించే ఈ నాలుగవ వంతులోనే మనకు తెలిసినది అత్యల్పం. అటువంటి పరమాత్మను ఎలా తెలుసుకోగలము ?
"పాదో2స్య విశ్వా భూతాని, త్రిపాదస్యామృతం దివి
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః ..."
మరి అటువంటి విరాట్పురుషుని అల్ప శక్తిమంతమైన ఇంద్రియాలతో మనం ఎలా పట్టుకో గలము ? మనం ఎలా తరించాలి, అంటే, మనం సృష్టిని, ప్రపంచాన్ని ఎలా చూడాలో తెలుసుకోవాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ప్రపంచంలో వేరు వేరు నామ రూపాలతో కనిపించే సమస్తమూ పరమాత్మ ప్రకటనమేనని గ్రహించాలి. జగత్తును జగత్తుగా చూడకుండా, జగత్తును పరమాత్మ అభివ్యక్తిగా చూడాలి. జగత్తంతా వ్యాపించిన పరమాత్మను దర్శించాలి అని చెప్తున్నారు.
🙏🙏🙏🌹🌹
డా.టి.(ఎస్)విశాలాక్షి
No comments:
Post a Comment